కొత్త వెల్లువ- మనసు వెన్నెల సంపుటంలో కథలు ఇరవై అయిదు. ఇవన్నీ 2019 నుండి ఈ మూడు నాలుగేళ్ల కాలంలో వ్రాయబడ్డాయి. ఈ కాలపు విపత్తులలో కరోనా సుజనా దేవిని బాగా వెంటాడింది. ఏడు కథలు కరోనా కేంద్రంగా వచ్చినవే. సాధారణ మధ్యతరగతి కోణం నుండి వ్రాయబడిన కథలు ఇవి. కరోనా కాలపు భయాలు , లాక్ డౌన్ అందరినీ ఇళ్లకు బందీలుగా చేస్తే అది అవ్యవస్థీకృత రంగాలలో పని చేసే ఎందరికో ఉపాధి లేకుండా చేయటం పెద్ద విషాదం. బయటకు పోయి ఏదో ఒక పని చేసుకోనిదే పొట్టగడవని వర్గం గురించిన స్పృహ సుజనాదేవికి ఉంది. ఇళ్ళల్లో పనిచేసే వాళ్లకు నెల జీతం ఇవ్వటం వాళ్ళ అవసరాలు కనిపెట్టి సహాయపడటం దగ్గర నుండి బయట కూడా అలాంటి వాళ్లకు అవసరమైన ఆర్ధిక సహాయానికో,సేవలు అందించటానికో మధ్యతరగతి సంసిద్ధం అవుతుం డటాన్ని ఆమె కథలు చెప్పాయి. కరోనా త్వరగా వ్యాపించే వ్యాధి కనుక కరోనా బాధితులను వాళ్ళు ఉన్న ఇంటిని బహిష్కరించినట్లుగా చేసే మనుషుల అతిభయాలు అమానవీయమైనవి అంటుంది సుజనా దేవి.
-- పశ్యంతి కాత్యాయనీ విద్మహే, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక.
ఏ కథకు ఆ కథ ప్రత్యేకత కలిగి ఉండడం రచయిత్రి నామని సుజనాదేవికే సాధ్యం అనడంలో అతిశయోక్తి లేదు. ఎలా అంటే సంఘంలోని రకరకాల వాస్తవ సమస్యలను చూపడం, దానికి పరిష్కారం కూడా చెప్పడం అద్భుతం. రెండు కల్సినట్లుగా సృష్టించటం రచయిత్రి ప్రత్యేకత. ఏ కథ టైటిల్ చదివినా సరిగ్గా ఇదే టైటిల్ సరైనది అనిపిస్తుంది. అది ఆ కథకు ఎంతో నప్పేలా ఉండడం కూడా విశేషమే!
-నేరెళ్ళ శోభా వేణుమాధవ్